న్యూఢిల్లీ ౼ పార్లమెంట్
వరంగల్ లో స్మార్ట్ సిటీ కార్యక్రమాలు, ఎస్సీ వర్గాలకు గృహాలు, ప్రజాభాగస్వామ్యంపై పార్లమెంట్లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
వరంగల్ నగరంలో అమలవుతున్న స్మార్ట్ సిటీ కార్యక్రమాల స్థితిగతులు, షెడ్యూల్డ్ కాస్ట్ (SC) వర్గాలకు అందుతున్న అఫర్డబుల్ హౌసింగ్ చర్యలు..
అలాగే నగర ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం అంశాలపై వరంగల్ లోక్సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిని పార్లమెంట్లో ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ..
వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి దిశగా సాగాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు అందుబాటు ధరల్లో గృహాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
అదేవిధంగా, నగరాభివృద్ధి ప్రణాళికల్లో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండాలని, వార్డు స్థాయి సమావేశాలు, ప్రజాభిప్రాయ సేకరణ, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా పౌరుల సూచనలు తీసుకోవడం అవసరమని ఎంపీ పేర్కొన్నారు.
వరంగల్ను ప్రజల అవసరాలకు అనుగుణంగా, సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని..
ఈ దిశగా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య డిమాండ్ చేశారు.
వరంగల్ ఎంపీ
డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి తోఖాన్ సాహు సమాధానమిస్తూ, తెలంగాణ రాష్ట్రం నుంచి గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీస్ మిషన్ (SCM)కు ఎంపికయ్యాయని తెలిపారు.
డిసెంబర్ 1, 2025 నాటికి గ్రేటర్ వరంగల్లో మొత్తం ₹1,800 కోట్ల వ్యయంతో 119 ప్రాజెక్టులు చేపట్టగా..
అందులో ₹1,498 కోట్ల విలువైన 103 ప్రాజెక్టులు (87 శాతం) పూర్తయ్యాయని, మిగిలిన ₹302 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఎస్సీ వర్గాల కోసం గృహాల అంశంపై మంత్రి స్పందిస్తూ, భూముల కేటాయింపు, కాలనీల అభివృద్ధి రాష్ట్రాల పరిధిలోని అంశమని, ఆయా రాష్ట్రాలు తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.
స్మార్ట్ సిటీస్ మిషన్ మొత్తం నగర అభివృద్ధి కాకుండా, ఏరియా ఆధారిత అభివృద్ధి విధానాన్ని (రిట్రోఫిట్టింగ్, రీడెవలప్మెంట్, గ్రీన్ఫీల్డ్, పాన్-సిటీ స్మార్ట్ సొల్యూషన్స్) అనుసరిస్తుందని స్పష్టం చేశారు.
ఇది ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచే అభివృద్ధి నమూనాలను రూపొందించడమే లక్ష్యంగా ఉందన్నారు.
ప్రజా భాగస్వామ్యంపై మంత్రి వివరిస్తూ…
ప్రతి నగరంలో స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ సిటీ ప్రపోజల్స్ రూపొందిస్తారని, ఇందుకు ప్రజలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారని చెప్పారు.
ప్రతి స్మార్ట్ సిటీలో స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరం ఏర్పాటు చేస్తారని, ఇందులో జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, ఎస్పీవీ సీఈఓ, యువత ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
ఈ మేరకు..
వరంగల్లో సమగ్ర, సమాన అభివృద్ధి జరగాలంటే మౌలిక వసతులతో పాటు అందరికీ అందుబాటులో గృహాలు, ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో సామాజిక–ఆర్థిక అసమానతలు తగ్గించడమే తన లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు.